కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యి రెండో రోజుకే థియేటర్స్ నుంచి తీసేసినా … దానికి చుట్టూ సాగుతున్న వివాదం మాత్రం తగ్గే సూచనలు కనిపించట్లేదు. తాజాగా ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్లింది. విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మహేష్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, కర్ణాటక సర్కార్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) క్లియర్ చేసి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా… కర్ణాటకలో మాత్రం థియేటర్ల వరకూ వెళ్ళలేకపోయిందని పిటిషనర్ వాదించారు. బెదిరింపులు, పోలీసుల జోక్యం, అనధికారిక ఆంక్షల వల్ల సినిమాను ఆపేయడం రాజ్యాంగాన్ని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు.
“ఇది వాక్ స్వాతంత్య్రంపై దాడి. ఇది వృత్తి స్వేచ్ఛను కాలరాస్తోంది” అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్టికల్ 19(1)(ఏ), 19(1)(జీ) ఉల్లంఘనగా పిలిచి, వెంటనే థియేటర్లలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ వివాదానికి మూలంగా నిలిచింది కమల్ హాసన్ చేసిన ఓ వ్యాఖ్య.
చెన్నైలో జరిగిన ఈవెంట్లో “మీ భాష కూడా తమిళం నుంచే పుట్టింది” అంటూ కన్నడ హీరో శివరాజ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడిన కమల్… తలెత్తిన వివాదం నేపథ్యంలో కూడా ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. క్షమాపణ చెప్పని ఆయన నిర్ణయాన్ని తప్పుపడుతూ… కన్నడ నేటివ్స్ “థగ్ లైఫ్” విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ పరిణామాల మధ్య, సినిమా విడుదలే కాకుండా రాజకీయ రంగంలోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివాదం సద్దుమణుగకపోవడంతో… ఇప్పుడు పరిష్కరిస్తూ తీర్పును కోర్టే చెప్పాల్సిన స్థితి వచ్చింది. తదుపరి విచారణ జూన్ 17న జరగనుంది.
విచిత్రం ఏమంటే… థియేటర్లలో ఆడకపోయినా, కోర్టు గదుల్లో మాత్రం థగ్ లైఫ్ నడుస్తూనే ఉంది!